Telangana Politics: దావోస్ వేదికగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. గత పదేళ్లలో ఏప్పుడు లేని రీతిలో ఏకంగా లక్షా 78 వేల కోట్ల రూపాయాలు రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో వచ్చాయి. అయితే తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం వెనుక అసలైన గేమ్ చేంజర్ మంత్రి శ్రీధర్ బాబు అని టాక్ వినిపిస్తోంది. ఆయన కృషివల్లే రాష్ట్రానికి పెట్టబడుల వరద పారినట్టు ప్రచారం జరుగుతోంది. అటు దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు లాంటి ఉద్దండులు వచ్చినా.. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో మంత్రి శ్రీధర్ బాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అందుకే ఇన్పోసిస్, విప్రో కంపెనీలు కూడా తమ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ముందుకువచ్చాయి. అయితే రేవంత్ రెడ్డి కూడా మంత్రి శ్రీధర్ బాబుకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరోసారి ప్రపంచానికి తెలిసి వచ్చిందని ప్రశంసల వర్షం కురుస్తోంది..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం 25 వేల 750 కోట్లు మాత్రమే.. కానీ ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి లక్షా 78 వేల కోట్లు తీసుకువచ్చింది. గతేడాది కూడా రాష్ట్రానికి 40 వేల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో ఐటీ శాఖ సెక్రటరీగా కొనసాగిన జయేష్ రంజన్ను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా దావోస్ టూర్లో శ్రీధర్ బాబు చొరవను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో 60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. అటు సన్ పెట్రో కెమికల్స్ 45 వేల 500 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యింది. అటు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడులకు సిద్దమైంది.
మరోవైపు మెగా కంపెనీ 15 వేల కోట్లతో పెట్టుబడులు పెడుతామమని ప్రకటించింది. అయితే ఈ కంపెనీలన్నీ తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమని వారికి వివరించడంలో మంత్రి విజయవంతం అయ్యారు. అంతేకాదు కేంద్రమంత్రి ఆశ్వనీ వైష్ణవ్తో కలిసి చర్చలు సాగించారు. ఇలా లక్షా 78 వేల కోట్లు రాష్ట్రానికి వచ్చేలా కృషి చేశారు..
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్పై దుష్ప్రచారం జరిగింది. రాష్ట్రం నుంచి పలు కంపెనీలు తరలిపోతున్నాయంటూ ప్రచారం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కొలువైన ఫాక్స్కాన్ కంపెనీ పెట్టుబడులను విరమించుకుంటున్నట్టు ప్రచారం జరిగింది. దాంతో రంగంలోకి దిగిన ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు.. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని వారికి భరోసా ఇచ్చారు. ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రం నుంచి తరలిపోకుండా చర్యలు చేపట్టారు.
ఇక రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పాటు కావడంతోనే హైడ్రా పేరుతో దూకుడు ప్రదర్శించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలాచోట్లు అక్రమ కట్టడాలను పేకమేడల్లా కూల్చివేసింది. దాంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్పై దెబ్బ పడింది. అటు హైడ్రా దెబ్బకు రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో జూన్ 2024 కు ముందు నిర్మించిన భవనాలు, ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ మంత్రి శ్రీధర్ బాబు ఈ నిర్ణయం తీసుకోకుంటే అలా హైదరాబాద్లో రియల్ఎస్టేట్కు కోలుకోలేని దెబ్బ తగిలేదని చెబుతున్నారు. అటు ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యేవట. అందుకే మంత్రి శ్రీధర్ బాబు హైడ్రా కూల్చివేతలపై ఈ ప్రకటన చేయించారని చెబుతున్నారు.
మొత్తంగా ఐటీ శాఖను పరుగులు పెట్టిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై మంత్రులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చిన మంత్రిని సహచర మంత్రులు ఘనంగా సత్కరించారు. మరోవైపు హైదరాబాద్కు ఐటీ కంపెనీల రాక కోసం ప్రయత్నిస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై ఐటీ ఉద్యోగులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కొలువుదీరడంతో పరిస్థితులు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడిన టెకీలు.. ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు పనితీరుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Delhi Elections 2025: ఢిల్లీలో గెలుపెవరిది..? దేశ రాజధానిలో మైకులు బంద్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter